Saturday, January 7, 2017

గోమహిమ gomahima


గోమహిమ అపారమైన విజ్ఞానంతో వేదములు మొదలుకొని, వేదాధారమైన అన్ని గ్రంథాలలోనూ కనపడుతున్నది. ఇటు వైద్యగ్రంథాలలోను, అటు ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా గోప్రశస్తి గోచరిస్తోంది. “యూయం గావో మేదయథ కృశం చిదశ్రీరం చిత్కృణుథా సుప్రతీకమ్ |భద్రం గృహం కృణుథ భద్రవాచో” – ఈ వేదమంత్రమునందు చెప్తున్న అంశము కృశించిన శరీరము గల వారికి నీవల్లనే హృష్ట, పుష్ట శక్తి వస్తున్నది అని. హృష్ట అంటే మనస్సుకు సంబంధించిన ఆనందం, పుష్ట అంటే శరీరానికి కావలసిన ఇంద్రియ పటుత్వం. ఈ రెండూ కూడా నీవల్లనే వచ్చాయమ్మా అని గోవును కీర్తించారు ఇక్కడ. అంటే గోక్షీరాది గవ్యముల వల్ల లభిస్తున్నది శారీరక పుష్ఠి, మానసిక తుష్టి. ఈ రెండూ ఇవ్వగలిగే శక్తి గోక్షీరానికి కానీ ఆ క్షీరం నుంచి కలిగే ద్రవ్యానికి కానీ ఉన్నది. దీనికి సంబంధించి అనేక పరిశోధనలు కూడా తేట తెల్లం చేస్తున్నాయి. అందుకే ప్రతి తల్లీదండ్రీ కూడా వారి పిల్లలకి ఆవుపాలు పట్టడం అనేది ప్రధానంగా అలవాటు చేసుకోవాలి. దేశవాళీ గోవుల క్షీరాన్ని పుచ్చుకున్నట్లయితే తప్పకుండా పిల్లలకు మేధస్సు వృద్ధిచెందుతుంది. ఇంద్రియ పుష్ఠి కూడా కలుగుతుంది. ఇది ప్రతి తల్లిదండ్రీ నిర్ణయించుకుంటే తప్పకుండా ఆవు రక్షింపబడుతుంది. ఆవుయొక్క అవసరాన్ని మనం ఎక్కువగా తెలుసుకోగలిగితే ఆవును రక్షించుకోగలం. ఆవిధంగా రైతులకు కూడా విజ్ఞానం కలిగించాలి. కేవలం పాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎక్కువ సొమ్ముల కోసం ఆవులను అమ్ముకుంటున్నారు. కానీ పాలు ఇవ్వకపోయినా సరే ఆవును మనతో పాటు ఉంచుకుంటే అది ఇచ్చే సంపద ఎంతో అధికము. ఈ పరిజ్ఞానం వాళ్ళకు కలిగించాలి. ఎందుకంటే ఆవు యొక్క పేడ కానీ, గోజలం గానీ వీటికి కూడా ఔషధీగుణములు ఉన్నాయి. పంచగవ్యముల ద్వారా తయారుచేసిన ఔషధములు మొండియైన దీర్ఘకాలిక వ్యాధులను కూడా తొలగిస్తున్నాయి అని వైద్యశాస్త్రంలో ఋజువు అవుతున్న సత్యాలు. అందుకే పంచగవ్య చికిత్సలు కూడా ఎక్కువగా వ్యాప్తి చేయాలి. దీనికి ముందుకు రావలసినవి ధార్మిక సంస్థలు, దేవాలయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవుల సంక్షేమాన్ని కోరుకునే సాంస్కృతిక సంస్థలు కూడా ముందుకు రావాలి. వీటి అవసరాన్ని వ్యాప్తి చేయాలి. ఇప్పుడు జాగృతి కలుగుతూ మన భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కొంతమంది పంచగవ్య ఉత్పత్తులను తీసుకొస్తున్నారు.
అదేవిధంగా గోవును పూజించి ప్రయోజనం ఏమున్నది? ఎటువంటి ప్రయోజనమూ లేదు. మనం పూజిస్తే అది భయపడి ప్రక్కకు పోతుంది కదా! అటువంటి దానిని పూజించడం ఏమిటి? అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. వారికి విన్నపం ఏమిటంటే గోవు భయపడవచ్చు, గోవును పూజిస్తున్నాం అని గోవుకు తెలియకపోవచ్చు, గోవుకు ప్రదక్షిణ చేస్తున్నాం అని గోవుకు తెలియకపోవచ్చు, ఎందుకంటే గోవులో ఉన్న జ్ఞానము, గోవులో ఉన్న జీవుడు వేరు. కానీ గోవు శరీరం మాత్రం భగవంతుడి ద్వారా ప్రసాదింపబడింది. ఆ శరీరంలో దేవతా శక్తులు ఉంటాయి. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గోవు శరీరంలో ఏ దేవతాశక్తులు ఉన్నాయో గోవుకు తెలియకపోవచ్చు. దానికి ప్రదక్షిణ చేసినట్లయితే దానిలో ఉన్న దేవతల అనుగ్రహం లభిస్తున్నది. ఒక ఔషధం వాడితే జబ్బు పోతుంది అనే విషయం ఔషధానికి తెలియదు. వాడుతున్న మనకి తెలుస్తుంది. అదేవిధంగా గోవు గురించి గోవుకు తెలియదు కదా అని కుతర్కాలు చేయడం కాదు. అంతేకాదు, తల్లి, తండ్రి, గురువు, గోవు ఇవి మనకు ప్రత్యక్షంగా కనపడుతున్న దేవతలు. సూర్య చంద్రుల తరువాత భూమి మీద కనపడుతున్న దేవతలు. తల్లిదండ్రులకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి కష్టం కలిగితే బాధ పడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళే తీర్చుకోలేనప్పుడు వాళ్ళకు నమస్కరిస్తే మన బాధలు ఎక్కడ పోతాయి అని కొడుకులు అనుకోకూడదు. తల్లిదండ్రులను పోషించాలి, నమస్కరించాలి. తల్లిదండ్రి అనేది మానవ ఉపాధి యైనప్పటికీ కూడా తల్లి అనే భావంలో, తండ్రి అనే భావంలో ఒక దివ్యత్వం ఉంటుంది. ఈ ఆరాధించే పుత్రుడు తల్లిదండ్రులపై భక్తి చూపిస్తే అందులో ఉన్న దైవత్వం ఆ పిల్లలను కాపాడుతుంది. తల్లిదండ్రీ కాపాడలేకపోవచ్చు. ఇది ఒక రహస్యం. అందుకే మాతృదేవోభవ! పితృదేవోభవ!’ అని చెప్పిన వాక్యాలలో తల్లిని, తండ్రిని దేవుడిగా చూడు అని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది.
అంతేకాదు కొన్ని రకాల గ్రహబాధలు పోవాలంటే తల్లిదండ్రుల కాళ్ళు కడిగి నీళ్ళు జల్లుకుంటే గ్రహబాధలు పోతాయి. ఏమిటి విశేషం అంటే మాతాపితరులనే భావంలోనే ఒక దైవత్వం ఉన్నది. అది భౌతికమైనటువంటి అంశాలకి దొరకనిది. దివ్యాంశాలని భౌతికంగా సమర్థించాలి అనుకోకూడదు. దివ్యత్వాన్ని గౌరవించవలసినదే. తల్లిదండ్రి, గురువు ఎలాగో గోవు కూడా అలాగే. గోవుల ఉనికి చాలా గొప్పది అని చెప్తూ ‘భద్రం గృహం కృణుథ భద్రవాచో’ – మా ఇంట్లో నీ అంబారావాలు మారుమ్రోగాలి తల్లీ అన్నారు. ఒక ఘంటానాదం, శంఖారావం అమంగళశక్తులను తొలగించి మంగళ శక్తులను ఆపాదిస్తాయి అంటారు. అందుకు ఏమీ తీసిపోదు ఆవు యొక్క అంబారావం. ఆవు కాలిక్రింది దుమ్ము గొప్ప విభూతి. ఆ గోధూళి నుదుట పెట్టుకుంటే అనేక దుష్టశక్తులు తొలగిపోతాయి. కృష్ణపరమాత్మ గోధూళితో నిండిన శరీరంతోనే ఉన్నాడు అంటాడు లీలాశుకుడు.
“గోధూళి ధూసరిత కోమల గోపవేషం
గోపాల బాలశతకైః అనుగమ్యమానం
సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్ధం
గచ్ఛంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం!!”



No comments: