Wednesday, May 31, 2017

‘వధ’ నిషేధంపై రాద్ధాంతం ఎందుకు? Gwte

ఒక్కసారి పూర్తిగా చదవండి

‘వధ’ నిషేధంపై రాద్ధాంతం ఎందుకు?

వధ కోసం కబేళాలకు పశువుల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాన్ని స్వాగతించడానికి బదులు కొందరు లేనిపోని రాజకీయ కోణంలో గందరగోళం సృష్టించడం సముచితం కాదు. పశువులను కేవలం వ్యవసాయ పనులకే విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మూగజీవాలకు వరం లాంటిది. పశువుల పట్ల క్రూరత్వాన్ని అదుపు చేసేందుకు ‘ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్ (రెగ్యులేషన్ ఆఫ్ లైవ్‌స్టాక్ మార్కెట్స్) రూల్ 2017’ ప్రకారం కబేళాలకు పశువులను (ఎద్దులు, ఆంబోతులు, ఆవులు, గేదెలు, దూడలు, ఒంటెలు) విక్రయించడాన్ని నిషేధిస్తూ చట్టం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పశువులను వ్యవసాయ పనులకే విక్రయించాలని, వధ కోసం కబేళాలకు విక్రయించరాదని కేంద్ర పర్యావరణ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయులంతా ముక్తకంఠంతో ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా పశువధను వ్యతిరేకించినట్లే. అయితే, ప్రభుత్వ నిర్ణయం పట్ల కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారూ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో నిరసనలతో విరుచుకుపడ్డారు. వీరి నిరసన సభ్యసమాజం అసహ్యించుకునే రీతిలో, మానవత్వం తలదించుకునే విధంగా సాగింది. నిరసనలు తెలుపడానికి రోడ్డెక్కిన వారు ఆవుల, ఎద్దుల పచ్చి మాంసాన్ని తింటూ బహిరంగ ప్రదర్శనలు చేసారు. వీరిలో మగవాళ్ళు, ఆడవాళ్లు కూడా ఉన్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలైతే బహిరంగంగా ఒక ఎద్దును చంపి ముక్కలు ముక్కలుగా కోసి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్నవారికి పచ్చి మాంసాన్ని పంచిపెట్టి విందు ఆరగించారు. వీరి ఈ రాక్షస నిరసన చూసిన వారికి అసలు మనం మనుషుల మధ్యనే జీవిస్తున్నామా? అన్న సందేహం కలుగుతుంది.
నిజానికి కబేళాలకు పశువుల విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూడు నెలల తరువాత అమలులోకి వస్తుంది. ఈలోగా అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ దేశవ్యాప్తంగా పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల నిరసన తెలపడానికి ఎవరికైనా సరే కావలసినంత సమయం ఉంది. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల పట్ల ఎవరైనా నిరసనలు తెలుపవచ్చు. తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చు. దేశవ్యాప్తంగా సభలు, సదస్సులూ నిర్వహించి శాంతియుతంగా తమ నిరసనను తెలియజేయవచ్చు. వీధులలోనూ, కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేయవచ్చు. కానీ, కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు సభ్య సమాజానికి అసహ్యం కలిగించేలా రాక్షస రీతిలో ప్రదర్శనలు చేసారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆవులు, ఎద్దుల వధను నిషేధిస్తే దానిని నిరసిస్తూ దళిత వర్గాల ప్రతినిధులమని చెప్పుకునేవారు కోల్‌కతలో ‘బీఫ్ ఫెస్టివల్’’ జరుపుకున్నారు. భారతదేశంలో హిందువుల విశ్వాసాలకు సంబంధించి ప్రస్తావన వస్తే చాలు కమ్యూనిస్టులు, వామపక్ష మేధావులు, కుహనా లౌకికవాదులు తమ శరీరాలపై తేళ్ళూ, జెర్రులూ పాకినట్లు గంగవెర్రులెత్తిపోతారు. తమకి ఎంతో ప్రీతికరమైన మైనారిటీ వోటు బ్యాంకుకు గండి పడకుండా ఉండడమే వారికి కావలసిందల్లా. అందుకోసం వీళ్ళు ఎంతదూరం వెళ్ళడానికైనా సిద్ధమే. గోవధ నిషేధం విషయంలో మొదటి నుంచీ వీరు ఇలా తీవ్ర వ్యితిరేక ధోరణినే ప్రదర్శిస్తూ వస్తున్నారు.
గోవును తల్లిగా పూజించడం, గోజాతికి చెందిన గేదెలు, ఎద్దుల వంటి పశువులను ఆదరభావంతో చూడడం మన దేశంలో అనాదిగా వస్తోంది. పండుగలు, శుభకార్యాలలో వాటికి ప్రత్యేక అలంకారాలు చేసి పూజించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అటువంటిది అడ్డూ అదుపూ లేకుండా- గోజాతికి చెందిన పశువులను వధించడమంటే మనందరికీ తీవ్ర మనస్తాపాన్ని కలిగించేదే. మన దేశంలో గోవు కేవలం భక్తివిశ్వాసాలకు మాత్రమే పరిమితమైనదా? అంతకుమించిన ప్రయోజనం వాటివల్ల ఏమీ లేదా? పూజలందుకోవడం మాత్రమే కాకుండా మన సమాజ ఆర్థిక వికాసానికి ఆవులు, ఇతర గోజాతికి చెందిన పశువులు ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? వాటిని వధించడం వల్ల మన ఆర్థిక వికాసానికి ఎంతటి నష్టం వాటిల్లుతోంది? ఇవన్నీ ఒకసారి ఈ సందర్భంగానైనా విశే్లషించుకోవాలి.
పశువధను నిషేధిస్తే ఫార్మశీ పరిశ్రమలలో కొన్ని ఔషధాల తయారీకి పశువుల ఎముకల నుండి లభ్యమయ్యే ఒక పదార్థం దొరకదని మన దేశంలోని వామపక్ష మేధావులు వాదిస్తారు. ‘సహజంగా మరణించిన పశువుల ఎముకల నుండి ఈ పదార్థాల్ని సేకరించవచ్చు కదా’ అని అంటే వీరు ఒప్పుకోరు. ‘వట్టిపోయిన ఆవులు, ఇతర పశువులను కబేళాలకు తరలించి వధిస్తే నష్టమేంటి?’ అని వాదించేవారూ ఉన్నారు. ఆవులు, గేదెలు పాలు ఇవ్వడానికి, ఎద్దులు బళ్ళు తోలడానికి, పొలాల్లో సేద్యం చేయడానికి మాత్రమే పనికొస్తాయా? అవి శక్తి ఉడిగి ముసలివైపోతే కబేళాలలో వధించడానికి తప్ప మరెందుకూ పనికిరావా?
భూగర్భం లోంచి వెలికితీసిన పెట్రో ఉత్పత్తులు, బొగ్గు వినిమయంతో ఇప్పటిదాకా ఈ ప్రపంచం నడుస్తోంది. ఇవి పూరించడానికి వీలులేని వనరులు. అంటే- ఇవి పూర్తిగా తరిగిపోతే వీటిని మళ్ళీ తేలేం. అధిక వినిమయం వల్ల ఈ వనరులు అత్యంత వేగంగా తరిగిపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పలు దేశాల ప్రభుత్వాలు వీటి వినిమయంపై 50 శాతం కోత విధించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు పంటలు త్వరగా, బాగా పండటానికి వాడుతున్న కృత్రిమ రసాయన ఎరువులు భూసారాన్ని తగ్గిస్తున్నాయి. భూతలాన్ని కలుషితం చేస్తున్నాయి. వట్టిపోయిన ఆవులు, ఇతర పశువుల వల్ల ఏమీ ఉపయోగం లేదనుకునేవారు ఒక విషయం గమనించాలి. అవి విసర్జించే పేడ, మూత్రం సహజ ఎరువులు. వీటివల్ల భూమి ఏ విధంగానూ కలుషితం కాదు సరికదా భూసారం పెరుగుతుంది కూడా. సేంద్రియ వ్యవసాయానికి ఇవి ఎంతో అవసరం. ఆవులు, ఇతర పశువుల పేడ నుంచి బయోగ్యాస్ తయారుచెయ్యవచ్చు. అందువల్ల శక్తి ఉడిగి, ముసలివైపోయిన పశువులను పనికిరానివిగా చూడనక్కర్లేదు. వాటిని సరైన రీతిలో వినియోగించుకుంటే పర్యావరణం దెబ్బతినకుండానే ఆర్థిక ప్రగతి సాధించవచ్చు.
‘ఆవులు మొదలైన గోజాతి పశువులను వధించడం వల్ల దేశానికి, ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టమేమిటి?’ అని అడిగేవారున్నారు. మరి ప్రభుత్వం వన్య మృగ సంరక్షణ కోసం, తాబేళ్ళ సంరక్షణ కోసం కోట్లలో ధనం వెచ్చించటం లేదా? పులులను చంపిన వాళ్ళని, నెమళ్ళని, జింకలని చంపి వండుకు తిన్నవాళ్ళని నేరస్థులుగా పరిగణించి శిక్షలు విధిస్తున్నామే. మరి గోవులను వధించడం ఎందుకు నేరం కాదు? ఇది విశ్వాసాలకు సంబంధించినది గానే కాక, పశు సంరక్షణ దిశగా ఎందుకు ఆలోచించరు?
ఇక మత విశ్వాసాలు, భావోద్వేగాల విషయానికి వస్తే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో పలు దేశాలలో జంతువుల విషయంలో వారి వారి మనోభావాలు ప్రస్ఫుటించడం మనం చూడవచ్చు. ఐరోపాలో గాని, అమెరికాలో గాని కుక్కలని చంపి వాటి మాంసంతో వంటకాలు చేయడం గురించి లేదా వాటి సంఖ్యను నియంత్రించడం గురించి ఎక్కడైనా ప్రస్తావిస్తే చాలు- శునక ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతాయి. మీడియాలో దీనిపై వాడి, వేడి చర్చలు సైతం జరుగుతాయి. కాబట్టి ఏ దేశమైనా సరే వారి వారి మత విశ్వాసాలను, భావోద్వేగాలను గౌరవించుకోవాలి. అది గోవుల విషయమైనా, కుక్కలు, కుందేళ్ళు లేదా మరే జంతువుల విషయమైనా సరే. మరి మన దేశంలో గోవధను నిషేధించాలనడం అవివేకంగా, పాతకాలపు చాదస్తంగా ఎందుకు చూడాలి?
‘మన దేశంలో మైనారిటీ మతస్థులు గోవు లేదా ఎద్దు మాంసం తింటారుగా. వారి సంగతి ఏమిటి?’’ అని ప్రశ్నించేవారు ఉన్నారు. మన దేశంలో మైనారిటీ మతాలకు చెందినవారు కొందరు తరచుగా ఎద్దు మాంసాన్ని భుజించడం తెలిసిందే. మతం లేదా వృత్తిరీత్యా వారి ఆహార ప్రాధాన్యతలను త్రోసిపుచ్చలేం. ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని తెలుసుకోవలసి ఉంది. మన దేశంలో మతపరంగానే గాక రాజశాసనాలలో కూడా వేల సంవత్సరాలుగా గోవధ నిషేధింపబడుతూనే ఉంది. అశోకుడు నుండి అక్బర్ వరకు గల చారిత్రిక ఆధారాలు మన దేశంలో ఆవులను, ఇతర గోజాతికి చెందిన పశువులను వధించడాన్ని నిషేధించినట్లు తెలుపుతున్నాయి. బ్రిటిష్ పాలకులపై జరిగిన 1857 స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి బహదూర్‌షా జఫర్ జారీచేసిన మొట్టమొదటి ఫర్మానా గోహత్యా నిషేధానికి సంబంధించినదే.
మన దేశంలో మత విశ్వాసాలతో ఎలాంటి సంబంధం లేకుండా అందరు పాలకులూ గోహత్యను నిషేధించారన్నది చారిత్రిక వాస్తవం. అయితే ఈ వాస్తవాన్ని బ్రిటిష్‌వారు దాచిపెట్టేశారు. హిందూ, ముస్లింల మధ్య గొడవలు పెట్టి అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన కదా. పోర్చుగీసు వారి నుండి బ్రిటిష్ వారి వరకు మన దేశాన్ని ఆక్రమించుక్ను ఐరోపా దేశీయులు ఎద్దు మాంసాన్ని ఎక్కువగా తింటారు. భారత్‌పై పాలనాధికారాన్ని చేజిక్కించుకున్న బ్రిటిష్ వారు గోహత్యా నిషేధాన్ని ఎత్తివేసి గోవు లేదా ఎద్దు మాంసాన్ని భుజించడం మైనారిటీ మతస్థుల అభీష్టంగా ప్రచారం చేశారు. ‘గోవధ నిషేధం గోమాంసం భుజించేవారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే కదా?’ అని వాదించేవారు ఉన్నారు. ఇది అర్థం లేని వాదన. గోరక్షణ అన్నది మన దేశంలోని అధిక శాతం ప్రజల మనోభావాలకు సంబంధించినది. ఎందుకంటే ఇప్పటికీ అధిక శాతం కుటుంబాలలో గోవు ఒక భాగస్వామి కూడా. వారి మనోభావాలను గౌరవించడం అందరి కనీస కర్తవ్యం.
గోవధ నిషేధం అన్నది కేవలం ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంగానే మన ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కానీ, దేశ ఆర్థిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ గోసంరక్షణతతో ముడిపడి ఉన్నాయి. హిందూ తత్త్వ చింతన మాత్రమే ఈ విషయంలో సమగ్రమైన దక్పథాన్ని ఆవిష్కరించింది. మతపరంగానే గాక ఆర్థికపరంగా, పర్యావరణ పరంగా కూడా గోసంతతి మనకు శ్రేయోదాయకమన్నది అనాదిగా వస్తూన్న చారిత్రిక వాస్తవం.

No comments: